IPL 2025 Opening Match | KKR vs RCB | RCB Won by 7 Wickets |Match Highlights|Vijay News Telugu
IPL పద్దెనిమిదవ ఎడిషన్ పోటీలు కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం అయ్యాయి. కన్నుల పండువ గా ప్రారంభమైన ఈ పోటీలలో మొదటి మ్యాచ్ ..కోల్ కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. టాస్ గెలుచుకున్న RCB కెప్టెన్ పాటిదార్ వ్యూహాత్మకం గా బౌలింగ్ ను ఎంచుకున్నాడు. దీనితో KKR ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
కోల్ కతా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రహానే యాభై ఆరు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. నాలుగు భారీ సిక్సర్లు, ఆరు బౌండరీలతో రహానే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. సునీల్ నరైన్ మూడు సిక్సర్లు, ఐదు బౌండరీలతో నలభై నాలుగు పరుగులు చేసారు. రఘు వంశీ ముప్పై పరుగులు చేసారు. రెండు వందలకు పైగా పరుగులు చేస్తారని అనిపించినప్పటికీ చివర్లో RCB బౌలర్లు కట్టుదిట్టం గా బౌలింగ్ చేయడం తో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట డెబ్భై నాలుగు పరుగులు మాత్రం చేయగలిగింది.
ఆర్సీబీ బౌలర్ల లో క్రుణాల్ పాండ్యా మూడు వికెట్లు, హేజెల్ వుడ్ రెండు వికెట్లు, యష్ దయాళ్ , సాలాం, సుయాష్ శర్మ ఒక్క్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు.
బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ ప్రారంభం నుండే దూకుడు గా ఆడింది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ మొదటి వికెట్ కు అభేద్యమైన తొంభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సాల్ట్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్ల తో యాభై ఆరు పరుగులు చేసారు. విరాట్ కోహ్లీ మరొక సారి తన విశ్వరూపం ప్రదర్శించారు. మూడు భారీ సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయం తో యాభై పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం విశేషం. టీ ట్వంటీ పోటీలలో విరాట్ కోహ్లీ కి ఇది తొంభై ఎనిమిదవ హాఫ్ సెంచరీ కాగా IPL పోటీలలో యాభై ఆరవ హాఫ్ సెంచరీ ఇది.
పడిక్కల్ పది పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ పాటిదార్ కేవలం పదహారు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేయడం తో ఆర్సీబీ గెలుపు నల్లేరు పై నడక లా సాగింది. చివర్లో లివింగ్ స్టోన్ గెలుపు కు అవసరమైన పరుగులు పూర్తి చేయడం తో KKR పై RCB ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గత IPL ఛాంపియన్ అయిన KKR ను స్వంత గ్రౌండ్ లోనే ఓడించడం తో ఆర్సీబీ శిబిరం ఫుల్ జోష్ లో కన్పించింది. ఇవీ నేటి IPL విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.